సోమవారం, నవంబర్ 30, 2020

నదులకీ పుష్కరుడికీ మధ్య ఉన్న బంధం ఏమిటి?

పోషయతీతి పుష్కరం.. పుష్కరం అనగా పోషించేది అని అర్ధం. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటూ, మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తుంది. 

మేధ్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేస్తే, తెలిసీ తెలియక చేసే పాపాలు పోతాయి. 

మార్జన అంటే నీటిని చల్లుకోవడం.. అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. 

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి, భారతదేశములోని 12 ముఖ్యమైన నదులకు 'పుష్కరాలు' వస్తాయి. బృహస్పతి (గురు గ్రహం) సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున తిరుగుతుంది. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట.

గంగా నది ------ మేష రాశి

రేవా నది (నర్మద) ------- వృషభ రాశి

సరస్వతీ నది ----- మిథున రాశి

యమునా నది ------ కర్కాటక రాశి

గోదావరి నది  ------ సింహ రాశి

కృష్ణా నది ------- కన్యా రాశి

కావేరీ నది ------ తులా రాశి

భీమా నది ------ వృశ్చిక రాశి

పుష్కరవాహిని/రాధ్యసాగ నది ------ ధనుర్ రాశి

తుంగభద్ర నది ------ మకర రాశి

సింధు నది ------ కుంభ రాశి

ప్రాణహిత నది ------ మీన రాశి

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కర కాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత శక్తివంతమైనవి.

అసలు ఎవరు ఈ పుష్కరుడు? 

పూర్వం తుందిలుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపచేసుకోగా, ఆ పరమాత్మ వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందిల మహర్షి నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరుకోగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలంలో తుందిలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందిల మహర్షి మూడున్నర కోట్ల తీర్ధాలకూ ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు.

సృష్టి మనుగడకు నీరే ఆధారం. కానీ జల సంపత్తి అంతా తుందిల మహర్షి ఆధీనంలో ఉండిపోవడంతో ఆ సృష్టి కర్త అయిన బ్రహ్మ శివుడిని ప్రార్ధించి, పుష్కరుడిని తన కమండలంలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇదిలా ఉండగా బృహస్పతి (గురు గ్రహం) లోకాన్ని కాపాడడం కోసం తనకు పుష్కర స్పర్శ కావాలనుకున్నాడు. అందుకోసం  జలాన్ని ఇవ్వాల్సిందిగా బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలి వెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. 

మేషాది రాశుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు మొదటి మరియు చివరి పన్నెండు రోజులూ పూర్తిగాను, మిగిలిన సంవత్సరం అంతా మధ్యాహ్న కాలంలో రెండు ముహూర్తాల కాలం పాటు పుష్కరుడు ఆ నదీ జలాల్లో ఉండేలాగా ఒప్పదం.

పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలు కూడా ఆ నదీజలంలో ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

పుష్కర స్నానం ఎలా చెయ్యాలి?

పుష్కర స్నానానికి నదిలో దిగేముందు చెప్పవలసిన శ్లోకం:

పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ 

మృత్తికాం తే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయా  

(స్త్రీలయితే 'మృత్తికాం' అని ఉన్న చోట 'హరిద్రాం' అని చదువుకోవాలి) 

ముందుగా, ఈ శ్లోకం చదువుతూ గట్టు మీద ఉన్న మట్టిని (స్త్రీలయితే మట్టికి బదులు పసుపు, కుంకుమ) కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి, ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్ర వచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట. దీని వెనుక ఒక పురాణ గాధ ఉన్నది...  

పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒక రోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ, ఆ చెట్టు పండ్లు తింటూ, అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి, చలించి పోయిన నారద మహర్షి  'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి, ఆ నామం నీ జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. 

ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తికి అభినందిస్తాడు. పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని అడగగా శనిదేవుడే అందుకు కారణమని చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెప్పగా, శాంతించి, శనిదేవుడిని తిరిగి గ్రహ మండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వారికి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని వరాన్ని ప్రసాదించాడు.  

తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా, ఆ యజ్ఞ కుండం లోంచి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవించింది. ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని, మునులని తినబోగా, వెంటనే పరమ శివుడు కల్పించుకుని, నిన్ను తలచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆఙ్ఞాపించాడట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తరువాతనే స్నానం చెయ్యాలి. 

ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. సభక్తికంగా మూడు మునకలు వేసినా సరిపోతుంది. కానీ సబ్బులు, షాంపూలతో మాత్రం నదీ స్నానం చెయ్యకూడదు.

పుష్కరాల సమయంలో...  

సూర్యోదయానికి పూర్వం చేసే 

స్నానం వలన.. వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం

పిండ ప్రదానం వలన... అశ్వమేధ యాగ ఫలము 

మధ్యాహ్న సమయంలో చేసే 

స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితము 

లభిస్తుందని శాస్త్ర వచనం. 

దానాలు: 

పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నదిపుష్కర 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దానానికి ప్రసిద్ధి. 

మొదటి రోజు: భూ దానం, ధాన్య దానం, సువర్ణ దానం, రజత దానం, అన్న దానం

రెండవ రోజు: రత్న దానం, గో దానం, లవణ దానం, వస్త్ర దానం

మూడవ రోజు: గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం (పండ్లు)

నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె

ఐదవ రోజు: ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు 

ఆరవ రోజు: ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం 

ఏడవ రోజు: గృహ దానం, మంచం, కుర్చీ, పీట లాంటి గృహోపకరణ వస్తువులు 

ఎనిమిదవ రోజు: చందనం, కంద మూలాలు, పుష్ప మాలలు 

తొమ్మిదవ రోజు: కంబళ్ళు, దుప్పట్లు, పిండ దానం, దాసీ దానం 

పదవ రోజు: శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం 

పదకొండవ రోజు: గజ దానం 

పన్నెండవ రోజు: నువ్వుల దానం 

పిండ ప్రదానాది కార్యక్రమాలు:

పుష్కర తీర్ధంలో పిండ ప్రదానం చేస్తే, సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసినట్లే.. అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా సూర్యోదయానికి పూర్వం చేసే పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో వేసుకున్నట్లే. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని శాస్త్ర వచనం. సూర్యాస్తమయ వేళలో మాత్రం పుష్కర తీర్ధంలో ఎలాంటి క్రతువులు నిర్వహించరాదు. 

 ముగింపు:

తీర్ధ స్నానం ఉత్తమం. దానికంటే నదీ స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం, బ్రహ్మము నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు ఉద్భవించాయి. నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇలాంటి మహత్తు ఉన్నందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత. 

బుధవారం, నవంబర్ 25, 2020

పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి?

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి? ప్రేత దేవతగా ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? వీటికి సమాధానం కావాలంటే పిండోపనిషత్తును చదవాల్సిందే. ఇది అథర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మ యోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో వివరించారు. 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

ఒకసారి బ్రహ్మదేవుడిని దేవతలు, మహర్షులు ''మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?'' అని ప్రశ్నించగా, దానికి బ్రహ్మ "దేహం, దేహి" గురించి వివరాలు చెప్పారు

మరణించిన తరువాత ఈ పాంచభౌతికమైన శరీరం నుండి పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే దేహి శరీరం నుండి వెళ్లి పోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళి పోతాయి. 

ముందుగా గాలి వెళ్లి పోతుంది (ఊపిరి ఆగిపోతుంది). దాని వలన పంచప్రాణాలు పోతాయి. 

గాలి తరువాత అగ్ని వెళ్లి పోతుంది. శరీరం చల్లబడుతుంది. తరువాత వైశ్వానరాగ్ని వెళ్లి పోతుంది. 

తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుండి కారిపోతుంది. 

ఎప్పుడైతే గాలి, నిప్పు, నీరు శరీరం నుండి తప్పుకున్నాయో అప్పుడు భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మాత్రమే మిగులుతాయి. కొన్ని రోజులకు ఇవి కూడా భూమిలో కలిసిపోతాయి. 

ఈ శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. 

ఇదే పంచభూతాలు వెళ్లిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని మరో రెండు శరీరాలు ఉంటాయి. 

కారణ శరీరం: మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. ఇది తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్లి పోతుంది. ఇదే నూతన శరీరం పొందుతుంది. 

యాతనా శరీరం: ఇది స్వర్గానికో లేక నరకానికో  వెళ్తుంది. 

ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్లిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత పదిరోజుల పాటు తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదవ రోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పది రోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్తుంది. 

మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి?

ప్రేతకు కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి, కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి, ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు. 

మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీనినే కలనం అంటారు. 

రెండో పిండం వలన చర్మం, మాంసం ఏర్పడతాయి. 

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. 

ఏడో పిండం వలన ఆయుః ప్రమాణం  కలుగుతుంది. 

ఎనిమిదో పిండం వలన మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 

తొమ్మిదో పిండం వలన అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. 

మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుండి సంపూర్తి శరీరం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి మనకు శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి, వారి ఋణం తీర్చుకోవాలి. 

మొత్తంగా ఒక సంవత్సర కాలంలో 16 పిండాలు ఇస్తారు. వీటిలో మొదటి 10 పిండాల నుండి మృతుడు క్రొత్త శరీరాలు పొందుతాడని పిండోపనిషత్తు ద్వారా తెలుస్తుంది. మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

మృతుని శరీరం నుండి పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని పిండోపనిషత్తు చెబుతోంది. 

మాసికాలు ఇవ్వకపోతే ఏమవుతుంది?

మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏదైనా పిండాన్ని ఇవ్వకపోతే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మాసికాలు మానేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. 

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం వలన చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేదే. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు. 

ప్రేత పితృదేవతా స్థానం ఎలా పొందుతుంది?

పూర్వక్రియలు (దహన సంస్కారాది 12 రోజుల క్రియలు), మధ్యమ క్రియలు (మాసికాలు), సపిండీకరణం జరిగే వరకూ దేహాన్ని విడిచిన ఆత్మ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందుకు జరిపి, ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని జరిపి, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. ఈ విధంగా పితృదేవతా స్థానం పొందుతుంది.

పుణ్య క్షేత్రాల్లో, పుణ్య తీర్ధాల్లో పిండ ప్రదానం చేస్తే ఏమవుతుంది?

కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయ వంటి పుణ్య క్షేత్రాల్లో పిండప్రదానం చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలుగుతాయి. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు. 

ఇలా పుణ్య క్షేత్రాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా పిండ ప్రదానం చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? 

దీనికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసిన అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అని మాత్రమే చెబుతారు.  

పితృ పూజకు దివ్యమైన కాలం ఏది?

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. మాఘపౌర్ణమి/మహామాఘి రోజున పితరులకు ప్రయాగలో పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమ పెద్దలకు నమస్కరించుకొని, స్వధా నామ పారాయణం చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒక రోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుండే పొందవచ్చు. ఇవే మాసికాల, పిండప్రదానాల రహస్యాలు. 

మంగళవారం, నవంబర్ 17, 2020

ఆత్మపిండం అంటే ఏమిటి?

ఆత్మ పిండం... అంటే తమ పిండాన్ని తామే పెట్టుకోవడం.. 

పూర్వం తాను చనిపోయిన తరువాత శ్రార్ధ కర్మ చేసి, ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు ఈ ఆత్మ పిండాన్ని పెట్టుకునేవారు

ఆత్మ పిండం పెట్టుకోదలచినవారు ముందుగా బ్రహ్మకపాలాన్ని దర్శించి, అక్కడ తనకు తానుగా మరణానంతర కర్మలు (దీనినే ఘటా శ్రార్ధం అంటారు) చేసుకోవాలి. తరువాత  కాశీ వెళ్ళి, విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేసి, గయ వెళ్లి, అక్కడ మూడు చోట్ల పిండాలు పెట్టుకోవడం ఆచారం. 

గయలో మొదటగా నదీ తీరంలోను, తరువాత విష్ణు పాదాల వద్ద, చివరగా అశ్వథ్థ వృక్ష మూలంలోనూ పిండాలు పెట్టడం ఆచారం.

ఆత్మ పిండం పెట్టుకున్నవారు తిరిగి ఇంటికిగానీ, మనుషుల్లోకిగానీ రాకూడదు. ఎటువంటి మంగళ కార్యాలకు హాజరు కాకూడదు. ఆశీర్వచనాలు ఇవ్వరాదు, తీసుకోరాదు. 

ఆత్మ పిండం పెట్టుకున్నవారు అన్ని రకాల ధార్మిక నియమాలను (జప, తప, దానాలు) పాటించాలి. మహాప్రస్ధానం వెళ్ళాలి. అంటే అడవుల్లోకీ, పర్వతాల్లోకీ వెళ్తూ సాధన చేసుకుంటూ గడపాలి.


నైమిశారణ్యం

నైమిశారణ్యం

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.

మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో అలరారుతున్న ఈ దివ్య ధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సూత, శౌనకాది మహా మహర్షులు నివశించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది.

అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని
తీర్థానాముత్తమం తీర్థం
క్షేత్రాణాం క్షేత్రముత్తమం అని పిలుస్తారు.

సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశంతంగా ఆధ్యాత్మకానుభూతులను ప్రోది చేసే దివ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని స్థానికులు నీమ్ సార్ గా, నీమ్ చార్ వ్యవహరిస్తుంటారు.

స్థల పురాణం :

ఒక సారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలి ప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా వుంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటికుండం  ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. ఈ పవిత్ర తీర్థాన్ని చక్ర తీర్థంగా పిలుచుకుంటున్నాం. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన రోజున సోమవతీ అమావాస్య అని పిలవడం జరుగుతుంది. అలాంటి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు, జపాలు అఖండమైన పుణ్యాన్ని ఆపాదించి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి. నైమిశారణ్యం దివ్యక్షేత్రం. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన అన్ని సంప్రదాయాలతో పాటూ హిందూ ధార్మిక విధానాలూ భక్తులకు అందుబాటులో ఉంటాయి. అనుక్షణం భగవంతుని నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యధామం ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది.

అలాగే దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది. వృత్తాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు దేవతలకు ఓ దివ్యాస్త్రం కావల్సి వచ్చింది. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుని వేడుకోగా దధీచి మహముని ఎముకలు నారాయణ తేజస్సుతో ప్రకాశిస్తాయని, ఆయన వెన్నెముక దివ్యాస్త్రంగా రూపొందుతుందని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారట. దేవతల అభీష్టం తెలుసుకున్న దధీచి మహాముని ప్రాణత్యాగం చేసి పూజ్యనీయుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దధీచి మహర్షి లోకకల్యాణార్థం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దివ్యస్థలం నైమిశారణ్యమేనని పురాణాల ద్వారా తెలుస్తుంది.


ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పారట. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.


దేవాలయాలు :

నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రముతో, త్రిశూల చిహ్నాముతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజుల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని గణేశ్ జీ అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెప్పబడుతున్న ఈ వినాయకుడికి ముందు ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.

సూత, శౌనుకాది మహా మునులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా విరాజిల్లుతున్న నైమిశారణ్య దివ్యక్షేత్రంలో ప్రతీ అడుగు మహిమాన్విత దేవీదేవతల ఆలయాలతో విరాజిల్లుతోంది. భూతేశ్వర్ నాథ్ మందిరానికి సమీపంలో వున్న మందిరాలలో బదరి నారాయణుడి (దేవ రాజన్ ) మందిరం చెప్పుకోదగినది. ఈ భూలోకంలో ఉన్న 108 వైష్ణవక్షేత్రాలలో బదరీనారాయణుడి ధామం కూడా ఒకటిగా ప్రసిద్ధి నొందినది. దీనితో పాటూ రాధాకృష్ణ, గోపాల్ , కాలభైరవుడు మొదలైన మందిరాలు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తాయి.

నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో లలితామాత దర్శనమిస్తుంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది.

అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరించిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి ,సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే ఈ క్షేత్రంలో విజయవాడ వైఖానన సమాజం వారు నిర్మించిన బాలాజీ మందిరం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది.

నైమిశారణ్యం సందర్శనం బహు జన్మల పుణ్యఫలం. హిందువుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.

నాకు నచ్చిన పద్యం

నాకు ఈ పద్యం అంటే చాలా ఇష్టం. ఇది ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం లోనిది. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. శ్రీకాళహస్తీశ్వర భక్తుడు. ఈయన  16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని అంచనా. ఈయన ఆనాటి "పొత్తపి సీమ" (ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి) పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మతః వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడయ్యాడని భావన. ధూర్జటి రచనలుగా మనకు లభించేవి రెండు మాత్రమే. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము

ధూర్జటి తాను ఈ  శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు 'కస్తూరి రంగ' కవి తన "యానంద రంగరాట్ఛందము" లో ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ "ఇది ధూర్జటి వారి శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి స్వీకరించబడినది" అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవియే రచించెననుట నిర్వివాదాంశం. 

వన్నే యేనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు, చే
గిన్నే బ్రహ్మకపాల, ముగ్రమగు భోగే కంఠాహారంబు మే
ల్నిన్నీ లాగున నుంటయుం దెలిసియు న్నీ పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుఁడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వరా!


ఈశ్వరా! నీవు కట్టే బట్ట ఏనుగు చర్మము. తినే ఆహారము కాలకూట విషం. చేతిలోని గిన్నె బ్రహ్మ కపాలము. కంఠాభరణాలు భయంకర సర్పాలు. మరి ఇవన్నీ తెలిసి కూడా లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు నీ పాదపద్మాలను తన మనస్సు లో చేర్చి నిన్ను ఎలా పూజిస్తున్నాడు స్వామీ! ఆయన సంపన్నుడైయుండియు ఆదిభిక్షువవైన నిన్ను ధ్యానించుట చిత్రమని భావము.



బుధవారం, అక్టోబర్ 17, 2018

అలహాబాద్ (ప్రయాగ) & గయ (నా కాశీ యాత్రలో భాగంగా)

మేము 9 రోజుల కాశీ యాత్ర చేసాము. మా యాత్రలో భాగంగా మధ్యలో ఒకరోజు ప్రయాగ, ఒకరోజు గయ వెళ్లి వచ్చాము. నా యత్రానుభవం బట్టి కాశీ వెళ్ళిపోయి వెనుకకు వచ్చి గయ యాత్ర చేసేకన్నా ముందుగా గయలో దిగిపోయి అక్కడ కార్యక్రమాల తరువాత కాశీ లేదా గయ నుండే నేరుగా అలహాబాద్ వెళ్లి అక్కడి నుండి కాశీ వెళ్ళేలాగా ప్రణాళిక వేసుకుంటే అటు సమయంతో పాటూ డబ్బు కూడా ఆదా అవుతుందని నా అభిప్రాయం. 

మా ప్రయాణం విశాఖపట్నం మీదుగా సాగింది కాబట్టి ఈ ప్రణాళిక కుదురుతుంది కానీ హైదరాబాద్ నుండి కాశీ వెళ్ళేవాళ్ళకి ముందే అలహాబాద్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ముందు ప్రయాగ.. తర్వాత కాశీ వెళ్లడం మంచిది. కానీ వైజాగ్.. పూరీ.. ఈ రూట్ లో కాశీ వెళ్లే యాత్రికులు ముందు గయలోనే దిగిపోండి.


గయ :
కాశీ నుండి గయ సుమారు 260 కి.మీ. ఉంటుంది. మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి గయకు బయలుదేరాము. సుమారుగా మధ్యాహ్నం 1 గంటకు గయ చేరుకున్నాం.


ప్రయాగ, కాశీ, గయ అనే ఈ మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖండం..

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌ 


అనగా.. ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవి.

గయ మహత్యం
ఆధ్యాత్మిక వైభవాన్నే కాకుండా ప్రాచీన చరిత్రనూ స్వంతం చెసుకున్న గయ క్షేత్రప్రస్తావన
మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీయ పురాణాల్లో కూడా ఉంది. గయాసురుడి పేరు మీద ఈ క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు,
స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది.

అత్యంత పవిత్రక్షేత్రంగా కీర్తించబడిన గయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధిచెందింది. గయలో భరద్వాజ మహర్షిముందుగా పిండ ప్రదానం చేసినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది.

స్థల పురాణం:
పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికే గయాసురుడు అని
వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాలు పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటా లేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు. "గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి
అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను" అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు.

అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞం వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు “మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై ఉంచండి" అని ఆదేశించాడు. 

దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై ఉంచినా తల కదులూతునే ఉంది. ఫలితంగా
బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని ఉండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాద ధూళి సోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై వుంచిన శిల బరువుకు ఎలా
అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవరూ ఇకమీదట నన్ను చూడలేరు. అయినా
ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా
నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు. గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఈ విధంగా గయ పితృదేవతల ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది.

గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో ఫల్గుణీ, మధుర, శ్వేత అనే మూడు నదులు సంగమిస్తూ ఉండడం వలన ఈ క్షేతం ప్రయాగతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతూ వుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. పిండ ప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే చెలమలను త్రవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని బట్టి ఇప్పటికీ ఫల్గుణీనది అంతర్వాహినిగా
ప్రవహిస్తూ ఉందని చెప్పవచ్చు. 

విష్ణుపద మందిరం:
ఫల్గుణీ నదీతీరంలోనే విష్ణుపద మందిరం కనిపిస్తుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగిన ఈ ఆలయంలో కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే  గదాధరుడు అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గదాధర స్వామిగా పూజ అందుకుంటున్నాడు. 

ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర
అడుగుల పొడవు, అర్థ అడగు వెడల్పు ఉన్న ఈ పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు. 

ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. దీనిని “అక్షయవటం" అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ చెట్టుకు చిరకాలం అక్షయవటంగా వర్థిల్లమని వరాన్ని ప్రసాదించిందట. 

మంగళగౌరి ఆలయం:
ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో ఉంది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది.

గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడి, శక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి. గయలో అమ్మవారి తొడ భాగం పడింది.

గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా ఉంటుంది.  ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయి.  గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా ఉంటుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. 

బుద్ధగయ:
గయ నుండి బుద్ధగయ సుమారు 12 కి.మీ. ఉంటుంది. సిధ్ధార్ధుడు జ్ఞానోదయం పొందిన రావిచెట్టు ఇక్కడే ఉంది. ఈ బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన తరువాతనే సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. ఈ రావిచెట్టుకింద ధ్యానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ మ్యూజియంలో బుద్ధుని జ్ఞానోదయ ఉదంతంపై నిర్మించిన డాక్యుమెంట్‌ తప్పక చూడాల్సిందే. 170 అడుగుల ఎత్తున నిర్మించిన మందిరంలోని బుద్ధభగవానుడు జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తాడు. బౌద్ధులకు అతి పవిత్ర క్షేత్రం ఈ బుద్ధ గయ. ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలు బహు సుందరంగా ఉంటాయి.


అలహాబాద్ (ప్రయాగ) : 
మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి ప్రయాగకు బయలుదేరాము. సుమారు 9 గంటలకు ప్రయాగ చేరుకున్నాం. వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ పుణ్యక్షేత్రం ఉంది.

గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. గంగానది శివుడిని తాకి పునీతమైతే, యమునా నది కృష్ణయ్య లీలలను నింపుకుంది. చల్లని సరస్వతీ నది అంతర్వాహినిగా ఈ సంగమ ప్రదేశంలో కలుస్తుంది. ఈ జీవనదుల్లో ప్రవహించే నీటితో దాదాపు ఉత్తర భారతం అంతా సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. 

ప్రయాగ మహత్యం: బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలోనే అనేక యజ్ఞాలు చేశాడట. అందుకే ఈ ప్రదేశానికి ప్రయాగ అనే పేరు వచ్చిందట.

ప్రయాగ అనగా 
ప్ర = ప్రకృష్ట (అనేక)
యాగ = యజ్ఞాలు జరిగిన క్షేత్రం

సముద్రగుప్తుడు కూడా ప్రయాగలో 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యజ్ఞాలు నిర్వహించాడట.

ప్రయాగలో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్య నివాసం ఉంటాయి. ఇక మాఘమాసంలో అయితే లెక్కకే అందనన్ని తీర్థాలు ప్రయాగ తీర్ధంలో కొలువై ఉంటాయట. స్వయంగా బ్రహ్మదేవుడు సైతం నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ ఉంటాడట. ఇక్కడ చనిపోయిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందట. జన్మ జన్మాంతరాలలో సంచయమైన పాపం, ప్రయాగ తీర్థ స్నానం వల్ల పోతుందట.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖండం..

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌ 

అనగా.. ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవి. అందుకే స్నానానికి ముందు ఇక్కడ (ప్రయాగలో) శిరోముండనం చేయించుకుంటారు.

సంగమ స్థలం విస్తీర్ణం సుమారుగా 5 యోజనాలు ఉంటుంది. సంగమ ప్రాంతం గంగా యమునల ప్రవాహం కారణంగా మూడు భాగాలుగా ఉంటుంది. గంగకు ఉత్తరాన ఉన్న స్థలాన్ని గంగాపాఠ్ లేదా ఆహ్వనీయాగ్నికుండం అని, ఈ రెండు నదుల మధ్యన ఉన్న ప్రదేశాన్ని (గంగకు దక్షిణాన, యమునకు ఉత్తరాన ఉన్న భాగం దోఆబ (ద్వాబా) లేదా గార్హాపత్యాగ్ని కుండం అని, యమునకు దక్షిణాన ఉన్న స్థలాన్ని యమునాపాఠ్ లేదా దక్షిణాగ్ని కుండం అని అంటారు. ఈ మూడు ప్రాంతాలలో శుచిగా, నియమాలతో ఒక్కొక్కరోజు చొప్పున గడిపితే, ఆయా క్షేత్రాలలో అగ్ని (త్రేతాగ్నులు) ఉపాసన చేసిన ఫలితం (యజ్ఞ ఫలం) దక్కుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది.

ఇక్కడ ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో మాఘ మేళా, 12 సంవత్సరాలకి ఒకసారి కుంభ మేళా, 144 సంవత్సరాలకి ఒకసారి మహా కుంభ మేళా జరుగుతాయి. ఈ మేళాలు నిర్వహించడానికి వెనుక ఒక పురాణగాధ ఉంది. దేవాసురులు సాగర మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ సమయంలో అమృతం కోసం దేవతలకీ, అసురులకీ మధ్య జరిగిన ఘర్షణలో అమృతభాండం నుండి అమృతం తొణికి కొన్ని చుక్కలు నాసిక్, ఉజ్జయిని, ఋషీకేశ్ లలో పడ్డాయట. కానీ, ప్రయాగలోని ఈ త్రివేణీ సంగమంలో అయితే అమృత భాండమే పడిందట. అందుకనే ఈ సంగమ ప్రదేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

వేణీ దానం:
త్రివేణీ సంగమంలో ఆచరించాల్సిన ప్రత్యేక పూజ ఈ వేణీ దానం. సుమంగళులైన స్త్రీలు తమ భర్తకు అర్చన చేసి, తను తెలిసీ తెలియక చేసిన తప్పులన్నిటికి క్షమాపణకోరి, అతని చేత కొంత జుట్టు కత్తిరింపజేసి, ఆ జుట్టును త్రివేణీ సంగమంలో వదులుతారు. సాధారణంగా కత్తిరించిన జుట్టు నీటిపై తేలుతుంది. కానీ ఇక్కడ జుట్టు మునుగుతుంది. ప్రయాగలో వేణీ దానం చేసిన స్త్రీలు నిత్య పసుపు కుంకుమలతో ఉండి, సుమంగళులుగానే మరణిస్తారట. ఈ వేణీ దానం తంతు అంతా భార్యను భర్త ఒడిలో కూర్చోపెట్టి చేయిస్తారు. 

కాశీ యాత్ర లో భాగంగా మనం ఇంటికి తీసుకెళ్లే గంగాజలం త్రివేణీ సంగమం నుండే తీసుకెళ్లాలి. కాబట్టి గంగాజలం నింపుకోడానికి ఖాళీ డబ్బాలు (బాటిల్స్) తీసుకెళ్లడం మర్చిపోకండి. 

ప్రయాగలో వసతులు : 
(ఇది నేను సేకరించిన సమాచారం మాత్రమే. ఎందుకంటే మేము తెల్లవారుఝామున కాశీ నుండి బయలుదేరి, మరలా రాత్రికి కాశీ చేరిపోయాం)
మీరు ప్రయాగకు చేరుకొనే ముందు రోజు, ప్రయాగలో ఉన్న శ్రీ లక్ష్మణ కుమార శాస్త్రి గారికి ఫోన్ చేసి, మీరు వస్తున్న ట్రైన్, కోచ్ వివరాలు తెలియజేస్తే, వారు మిమ్మల్ని తమ సత్రానికి చేర్చడానికి అక్కడి వ్యక్తులను పురమాయిస్తారు.  వీరి సత్రంలో వసతి గృహాలు ఉచితమే. కాకపోతే ప్రయాగలోని తంతులన్నీ వీరి పురోహితులతోనే జరిపించుకోవలసి ఉంటుంది. సత్రానికి చేరుకున్నాక, మీరు ఏమేమి చేయదలచుకున్నారో వాటికి తగిన రుసుము చెల్లిస్తే, ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదును తీసుకెళ్ళి, సంగమం వద్దనున్న వారి అర్చకులకు చూపిస్తే, మీ కార్యక్రమాలన్నిటినీ వారే చూసుకుంటారు.

Address: శ్రీ లక్ష్మణ కుమార శాస్త్రి, 110/105, Bakshi Daragunj, Allahabad, Uttar Pradesh - 211 006
Phone: 09415238615
Land Line: 0532 - 2501729, 2506058

వసతితో పనిలేకుండా, కేవలం సంగమ స్నానమే అయితే ఆలోక్ ధర్మాధికారి గారు బాగా చేయిస్తారట. ఆయన ఫోన్ నెంబరు 09452934193 & 09335355520

ప్రయాగలో దర్శించవలసిన ఆలయాలు, ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటి వివరాలు... 

పాతాళపుర మందిర్ :
త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట ఒకటి ఉంది. కోట లోపలికి ప్రవేశం నిషిద్ధం. కానీ ఈ కోటలో ఉన్న పాతాళపుర మందిర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళవచ్చు. ఫోటోలు మాత్రం తీయనివ్వరు. కోట అంతా ఆర్మీ వాళ్ళ నిరంతర గస్తీతో కట్టు దిట్టంగా ఉంటుంది.

పాతాళపుర మందిర్ సుమారుగా 84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా ఉంటుంది. దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం ఉంది. గయలో కురుక్షేత్రంలో చనిపోయిన తమ బంధుజనానికి పాండవులు శ్రార్ధ కర్మలు నిర్వహించారట. ఇంకా ఈ ఆలయంలో వేద వ్యాసుడు, వాల్మీకి, సనక సనందులు, ఇంకా అనేక ఋషులు, దేవతల విగ్రహాలు ఉన్నాయి.

అక్షయవట్ : ఇక్కడే అతి పురాతనం అయిన వట వృక్షం ఒకటి ఉంది. మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే ఉండేదట. అక్బర్ కోట కట్టించినప్పుడు స్ధలం ఎత్తు పెంచడంతో ప్రస్తుతం ఇవి భూగర్భంలోకి వెళ్లాయి. ఈ వటవృక్షానికి ఉన్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలట. ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి, చెట్టు మొదళ్ళను కౌగలించుకోమంటారు.

యముడు, దండపాణి, భైరవుడు, ప్రయాగ రాజేశ్వరి, గంగామాత, మృత్యుంజయుడు, సూర్యదేవుడు, సరస్వతి దేవి, జాంబవంతుడు, ఇంకా అనేక దేవీదేవతలు కొలువై ఉన్నారు. 

శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి, ఈ వట వృక్షం కిందనే కూర్చున్నాడట. ఇక్కడే తన తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడట. భరతుడు తన అన్నను వెతుక్కుంటూ వచ్చినప్పుడు, ఇక్కడ ఆగాడని తెలుసుకుని, ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఒక విగ్రహం ఉంటుంది. 

ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వం ఈ చెట్టు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకునేవారట.

ఈ కోటలోనే మన దేశంలో ప్రసిద్ధి చెందిన అశోక స్తంభం ఉంది. దీన్ని కౌశాంభి నుండి తెచ్చి, ఇక్కడ స్ధాపించారట.


బడే హనుమాన్ మందిర్ :
పాతాళపుర మందిర్ కి సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం. రామ రావణ యుధ్ధానంతరం ఆంజనేయస్వామి కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట. అందుకనే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని చాలా ప్రయత్నాలు చేశారట. విగ్రహాన్ని తవ్వేకొద్దీ భూమిలో గుంటలాగా ఏర్పడి, విగ్రహం ఇంకా స్ధిరంగా అయిపోయిందట. ఇప్పటికీ విగ్రహం ఆ గుంటలోనే ఉంటుంది. వర్షాకాలంలో గంగానది పొంగితే, గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందట. అప్పుడు ఆంజనేయస్వామి గంగలో స్నానం చేస్తున్నట్టుగా అనిపిస్తుందట. 

స్వామి ఆవిర్భావానికి మరో కధ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం కనౌజ్ ప్రాంతంలో సంతానం లేని గొప్ప ధనవంతుడు వింధ్యాచలం వెళ్లి పెద్ద హనుమాన్ విగ్రహాన్ని తయారు చేయించి, స్వామికి స్నానం చేయించాలని భావించాడట. ఈ విగ్రహానికి వివిధ పవిత్ర క్షేత్రాలలో స్నానం చేయిస్తూ, త్రివేణీ సంగమంలో కూడా స్నానం చేయించి, ఆ రాత్రి అక్కడే నిద్రించాడట. రాత్రి కలలో విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలనే భావన రావడంతో, ఉదయం లేవగానే కనౌజ్ కు బయలు దేరి వెళ్ళిపోయాడట. ఇంటికి చేరగానే భార్య గర్భం దాల్చిందని తెలిసి, బడే హనుమాన్ స్వామి అనుగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకోగా, కొంత కాలానికి కొడుకు పుట్టాడట.


బడే హనుమాన్ ఇక్కడే నీటిలో మునిగి ఇసుకలో కూరుకు పోయాడట. ఒక రోజు వ్యాఘ్ర చర్మాంబరధారి అయిన బాలగిరి స్వామీజీ త్రివేణీ సంగమంలో స్నానం చేసి, తన త్రిశూలాన్ని నేలమీద గుచ్చగా, అక్కడ బడే హనుమాన్ విగ్రహం కనిపించిందట. నెమ్మదిగా ఇసుక, మట్టి తీయించి విగ్రహం బయటపడేట్లు చేసి, స్వామి అనుగ్రహం కోసం అక్కడే తపస్సు చేశారట. దీనితో బడే హనుమాన్ కీర్తి జనంలో బాగా వ్యాపించిందని చెప్తారు.

శంకర విమాన మండపం :
జగద్గురువులయిన ఆదిశంకరాచార్యుల వారు, కుమార స్వామి స్వరూపం అయిన కుమరిల భట్టు అనే విద్వాంసుడిని తన అద్వైత తత్వ జ్ఞానంతో ఓడించిన ప్రదేశంలో ఆయన విజయానికి గుర్తుగా ఒక విజయ స్తంభాన్ని స్థాపించాలని, కంచి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు సంకల్పించి నిర్మించిన కట్టడమే ఈ శంకర విమాన మండపం లేదా శంకర మఠం. 

ఈ మండప నిర్మాణం ద్రవిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో కామాక్షీ దేవి, ఆదిశంకరాచార్యులు, కుమారిల భట్టు విగ్రహాలతో పాటు అనేక దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ యోగశాస్త్ర బద్దంగా 1008 లింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఇంకా 108 విష్ణాలయాలు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. బడే హనుమాన్ మందిర్ కి సమీపంలోనే ఉంటుంది ఈ 4 అంతస్థుల విమాన మండపం.

మాధవేశ్వరీ శక్తి పీఠం :
అష్ఠాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం తప్పక దర్శించాల్సిన ఆలయం. మాధవేశ్వరీ దేవిని అలోపీ దేవిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు పడినట్టు దేవీభాగవతం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులుగా ఒక నలుచదరం పీఠం ఉండి, దానిపైన ఒక  వస్త్రంతో హుండీ వేలాడతీసి ఉంటుంది. హుండీ క్రిందుగా ఒక ఉయ్యాల కట్టి ఉంటుంది. భక్తులు తమ కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచే మొక్కుతారు.

దీనికి ప్రక్కగా అమ్మవారి దివ్యమంగళ రూపంతో ఉండే పాలరాతి విగ్రహంతో పాటూ, శివుడు సతీదేవిని భుజం పైన వేసుకుని ఉగ్రతాండవం చేస్తున్నట్టు ఉండే ప్రతిమ చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో శివుడు కూడా మహా లింగ రూపుడై కొలువుతీరాడు. ఈ ఆలయ ఆవరణలోనే శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం క్రిందనే ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు కొలువు తీరి ఉన్నారు. వీరిని అర్చిస్తే సమస్త గ్రహ దోషాలూ నశిస్తాయని నమ్మకం. ఇక్కడే ఉన్న మరో ఉపాలయం రామ్ జానకీ మందిరం. ఈ మందిరంలోని సీతారాముల పాలరాతి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి.

భరద్వాజ ఆశ్రమం :
రామాయణం ప్రకారం, వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ భరద్వాజ మహాముని ఆశ్రమానికే వచ్చాడు. ఇక్కడే మూడు రాత్రులు ఉండి, భరద్వాజ మహర్షి సూచనతో సుమారు 131 కి.మీ.ల దూరంలో ఉన్న చిత్రకూట్ కి వెళ్ళారు. ఈ భరద్వాజుని ఆశ్రమంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్తూ భరద్వాజుడు అర్చించిన శివలింగం ఉంది. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు శ్రీరాముడు కూడా ఈ లింగాన్ని అర్చించాడట. ఈ ఆశ్రమ సందర్శన ఎంతో మానసిక సంతృప్తిని ఇస్తుంది. పూర్వం గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలోనే ప్రవహిస్తూ ఉండేదట. అక్బరు కాలంలో నిర్మిచిన బక్షి, బేని ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారిందట. 

ఆనంద్ భవన్ :
ఈ భవనం లోనే మన దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాల్యం గడిచింది. ఇందిరా గాంధీ జన్మించింది కూడా ఇక్కడే. మన జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ఈ భవనం ఒక సాక్షిభూతం. గాంధీగారు అలహాబాద్ వస్తే ఈ భవనంలోనే ఉండేవారట. ఇందిరాగాంధీ వివాహం కూడా ఈ భవనంలోనే జరిగిందట. ప్రస్తుతం ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ ఉంది. కొంత భాగం ఆల్ ఇండియా కాంగ్రెస్ వినియోగిస్తుంది. కొంత భాగంలో మ్యూజియం నిర్వహిస్తున్నారు. ఉదయం 9-30 నుండి సాయంత్రం 5-30 వరకు మ్యూజియం తెరిచి ఉంటుంది. ప్రతీ సోమవారం మరియు జాతీయ సెలవు దినాలలో మ్యూజియం ఉండదు. 

నాగ వాసుకీ దేవాలయం :
ఈ నాగ వాసుకీ దేవాలయం అతి పురాతనమైన ఆలయం. వాసుకిని కశ్యప మహాముని పుత్రుడుగా చెప్తారు. మానసాదేవిని వాసుకికి సోదరిగా చెప్తారు. నాగులకి రాజు ఈ వాసుకి. ఈ వాసుకీ నాగ రాజే క్షీర సాగర మధనంలో మంధర పర్వతానికి తాడులాగా చుట్టబడ్డాడు. వాసుకీ నాగరాజుని అర్చిస్తే సమస్త నాగదోషాలు తొలగిపోతాయట.

మన్ కామేశ్వర్ మహా దేవ్ :
ప్రయాగలోని ప్రాచీన ఆలయాలలో మన్ కామేశ్వర్ ఆలయం ఒకటి. సాక్షాత్తూ శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్టించి పుజించిన లింగం ఈ మన్ కామేశ్వరుడు. ఇక్కడ స్వామిని మనం కోరికలు కొరవలసిన అవసరం లేదట. మన మనస్సులోని ఆంతర్యం గ్రహించి నెరవేర్చగలడు కాబట్టే మన్ కామేశ్వరుడయ్యాడు. ఇక్కడ శివునికిచ్చే హారతి చాలా బాగుంటుంది. 

వేణీ మాధవుడు :
పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి ఈ వేణీ మాధవుడు. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఈ వేణీ మాధవుణ్ణి దర్శించకుంటే ఆ స్నానఫలం పొందరని తన రామచరితమానసంలో తులసీదాసు చెప్పాడు. ఈ ఆలయం ప్రయాగలోని దారాగంజ్ ప్రాంతంలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘాట్ కు దగ్గరగా ఉంది. అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించక ముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం. త్రివేణీ  సంగమ స్థానం నుండి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ ఆలయంలో మనకు లక్ష్మీదేవి, నారాయణుని విగ్రహాలు కనిపిస్తాయి కాబట్టి ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. పద్మ పురాణం ప్రకారం ప్రయాగ క్షేత్రానికి ఈ వేణీమాధవుడే అధిదేవత. ఈ ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు. 

సీతా మడి :
అలహబాద్ - వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత, రహదారి నుండి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సీతామడి వస్తుంది. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశమే సీతామడి. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజసిద్ధంగా ఉండి, చూపరులను కట్టి పడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది. ఇక్కడ సీతాదేవి ఆలయం, ఆంజనేయ ఆలయం ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం సొరంగమార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది.

వింధ్యాచలేశ్వరి :
సీతామడి నుండి రెండుగంటలు ప్రయాణం చేస్తే, వింధ్యాచలం అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ వింధ్యాచలేశ్వరి అమ్మవారు కొలువు తీరి ఉంది. పురాణం ప్రకారం, శుంభ నిశుంభులనే  రాక్షసులను సంహరించిన తర్వాత కాళీమాత ఇక్కడ వింధ్యాచలేశ్వరిగా వెలిసిందట. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని తాకొచ్చు.

ముగింపు:
ప్రయాగని తీర్థరాజం అంటారు. అనగా అన్ని తీర్ధాలకు రాజు అని అర్ధం. ప్రయాగ పౌరాణికంగానే కాదు.. ప్రకృతి అందాలలోనూ విశిష్ఠమైనదే. అందుకే ప్రయాగ వైభవానికి ముగ్ధుడైన అక్బర్ తను కొత్తగా స్ధాపించిన మతం దీన్-ఇ-ఇలాహీ పేరు కలసి వచ్చేటట్లుగా అలహాబాద్ అని మార్చాడు. అప్పటి నుండి ప్రయాగ అలహాబాద్ గా కూడా పిలవబడుతుంది.

మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి ప్రయాగకు బయలుదేరితే, తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో కాశీ చేరుకున్నాం.

మంగళవారం, జనవరి 02, 2018

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి 7 కొడుకులు... ఈ కథ ఎంత మంది విన్నారు?

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి 7 కొడుకులు... ఈ కథ ఎంత మంది విన్నారు? ఎంత మందికి గుర్తుంది? అసలు ఈ కథ (పరమా)అర్ధం తెలుసా మీకు..???

కథ:
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.

చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమేటు అడ్డమొచ్చింది.

గడ్డిమేటా... ఎందుకు అడ్డమొచ్చావ్...? ఆవు మెయ్యలేదు.

ఆవా ఎందుకు మెయ్యలేదు...?  గొల్లవాడు మేపలేదు.

గొల్లవాడా... ఎందుకు మేపలేదు...? అమ్మ అన్నం పెట్టలేదు.

అమ్మా...ఎందుకు అన్నం పెట్టలేదు...? పిల్లవాడు ఏడిచాడు.

పిల్లవాడా... ఎందుకు ఏడిచావు...?  చీమ కుట్టింది.

చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా... అన్నది.

రాజుగారు అంటే మనిషి. ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త ధాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట. 7 చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (ధనమును దుబారాగా ఖర్చుచేయుట).

ఎండగట్టటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది. ఎండపెట్టాము అంటే వ్యసనాల్ని జయించామని అర్ధం. సాధన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.

ఒక చేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలిన వాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది. కామాన్ని జయించడము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది. అయిననూ అది కూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తొలగుటయే కదా మోక్షము.

చేప ఎండక పోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే..  గడ్డి మేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పట్టి పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చారు.

గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.

ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.

"కృష్ణం వందే జగద్గురుం" అనగా జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.

గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞ లేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను.

ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.

అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు.

 జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత.

అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి బాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.

చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట.

చివరకు అనురక్తి తొలగి సంసార బాల నుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును.

కథ సారాంశము:
సప్తధాతువులతో కూడిన మనిషి సాధన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామమును జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును.

కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.