ఆదివారం, జనవరి 05, 2025

2025 ప్రయాగలో జరిగే మహాకుంభమేళా విశేషాలు Prayag Kumbh Mela 2025

కుంభమేళా అంటే ఏమిటి?

కుంభమేళా అనేది ఈ ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఈ కుంభమేళాకు కేవలం భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా అతిపెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఎందుకు ఇంతమంది భక్తులు ఒకేచోట హాజరవుతారు? ఈ కుంభమేళా ప్రత్యేకతలు ఏమిటి? తెలుసుకుందాం రండి....

మన సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 4 సంవత్సరాలకు ఒకసారి సాధారణ కుంభమేళా, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, 144 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. 

సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి వివిధ రాశిచక్రాలలో ఆ కాలంలో ఏ స్థానంలో ఉంటారు అనేదానిపై ఆధారపడి, కుంభమేళా స్థలం నిర్ణయించబడుతుంది.. 

సూర్యుడు, చంద్రుడు కర్కాటకంలో, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు నాసిక్ - త్య్రంబకేశ్వర్ లోను (గోదావరి నది ఒడ్డున)

సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు ధనస్సులో, బృహస్పతి  కుంభరాశిలో  ఉన్నప్పుడు హరిద్వార్ లోను (గంగా నది ఒడ్డున)

సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో  ఉన్నప్పుడు ప్రయాగలోను (గంగా-యమునా మరియు అదృశ్య సరస్వతి నదుల సంగమం)

సూర్యుడు, చంద్రుడు మేషరాశిలో, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను ( క్షిప్రా నది ఒడ్డున) నిర్వహిస్తారు. 

అయితే వీటన్నింటిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రయాగ్‌రాజ్‌లోనే గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం జరుగుతుంది. దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారు. మహా కుంభం వేళ గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. 

2013 సంవత్సరంలో ప్రయాగ్‌రాజ్‌లో పూర్ణ  కుంభమేళా (ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది)నిర్వహించారు. 


2019 సంవత్సరంలో ప్రయాగలో అర్ధ కుంభమేళా (6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది) నిర్వహించారు. 


ఇప్పుడు 2025 సంవత్సరంలో ప్రయాగలో జరిగేది మహా కుంభమేళా. (144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగేది) 

కుంభమేళాకు ఆధారాలు : 

పౌరాణిక ఆధారాలు :

పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీర సాగర మథనం సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహా భారతంలో, రామాయణం లో కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.

పురాణాల ప్రకారం... దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవ దానవుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు, ఆ అమృతభాండంలోని కొన్ని చుక్కలు నాశిక్, ఉజ్జయిని, ప్రయాగ, హరిద్వార్ లలో పడ్డాయి. అమృత బిందువులు పడిన ఈ 4 ప్రదేశాలలోనే కుంభమేళా జరుగుతుంది. ఈ కాలంలో నదీ జలాలు  అమృతంగా మారతాయని శాస్త్రం. దేవతలకు 12 రోజులు భూలోకంలో 12 సంవత్సరాలకు సమానం. అందుకే ప్రతీ 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పూర్ణ కుంభమేళాకు అంతటి ప్రాముఖ్యత.

చారిత్రక ఆధారాలు :

కుంభమేళా స్నానానికి దాదాపు 1400 ఏళ్లకు పైగా చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. 629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ యొక్క రచనలలో  కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.  ఇదే మొట్ట మొదటగా లభించిన చారిత్రక ఆధారం. కానీ పురాణాల ప్రకారం అమృతకలశం ఉద్భవించినప్పటి నుండే ఈ కుంభ మేళ స్నానాలు ప్రారంభం అయ్యాయని, అప్పటినుండి నిరంతరం ఆగకుండా జరుగుతున్నాయని హిందువుల విశ్వాసం. కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు అని అంటారు కానీ అది నిజం కాదు. ఆది శంకరాచార్యులవారికి పూర్వం నుండే కుంభమేళా జరిగినట్టు చారిత్రక ఆధారాలు లభ్యం అవుతున్నాయి. ఆదిశంకరాచార్యులవారు కుంభ స్నాన పద్దతులను పునరుద్ధరించి అఖాడాలను స్థాపించారని చెప్తారు. 

2025 సంవత్సరంలో ముఖ్యమైన షాహీ స్నాన తేదీలు : 

2025 సంవత్సరంలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు కుంభ స్నానాలు చేస్తారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన తేదీలలో చేసే స్నానాలు ప్రఖ్యాతి పొందాయి. వాటినే షాహీ స్నానాలుగా (రాజ స్నానం) పేర్కొంటారు. అవి... 

13 జనవరి 2025, పుష్య పూర్ణిమ
14 జనవరి 2025, మకర సంక్రాంతి
29 జనవరి 2025, మౌని అమావాస్య
3 ఫిబ్రవరి 2025, వసంత పంచమి
4 ఫిబ్రవరి 2025, రథ సప్తమి 
12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ
26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్య స్నానం ముగుస్తుంది.

కుంభమేళాలో చేయవలసిన/చేయకూడని పనులు :
> కుంభమేళాలో గంగా స్నానం చేసే భక్తులందరూ తప్పనిసరిగా మత సంప్రదాయాలను, నియమాలను పాటించాలి. 
> గంగానదిలో స్నానం చేసేటప్పుడు సబ్బులు, షాంపూలు ఉపయోగించకండి. 
> నదిలో సబ్బులతో బట్టలు ఉతక్కండి.
> రాత్రి నిద్రించిన దుస్తులతో నదీస్నానం మహా పాపం. 
> మనం వసతి దగ్గరే శుభ్రంగా స్నానం చేసి, ఉతికిన దుస్తులు ధరించి నదీ స్నానానికి వెళ్ళాలి. 
> నదిలో సంకల్పం చెప్పుకుని, పవిత్రంగా 3 మునకలు వెయ్యాలి. 
కుంభమేళాలో చేసే స్నానం, దానం, జపం, తపం, హోమం ఎంతో ముఖ్యమైనవి. 
> ప్రయాగలో కుంభమేళా సమయంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. 
> మీకు అక్కడ ఎలాంటి అసౌకర్యం కలిగినా అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ వారి సహాయం తీసుకోండి. 
> ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకుని పుణ్యకార్యంలో భాగస్వాములవ్వండి.
అఘోరాలు, నాగ సాధువులు ఒక్కరేనా?
కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అఘోరాలు నాగ సాధువులు చూడ్డానికి ఒకేలాగా కనిపించినా, నిజానికి నాగ సాధువులకు మరియు అఘోరీ బాబాలకు వారి తపస్సు, జీవనం, ధ్యానం, ఆహారం మొదలైన విషయాలలో చాలా తేడా ఉంది.

నాగ సాధువు మరియు అఘోరీగా మారడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. నాగ సాధువులు అఖారాలలో, హిమాలయాలలో ఉంటారు మరియు సన్యాసి కావడానికి అఖారా యొక్క కష్టమైన పరీక్షలలో విజయం సాధించాలి. కానీ అఘోరీ బాబాగా మారడానికి, శ్మశానవాటికలో తపస్సు చేయాలి. ఇద్దరూ శివుడిని పూజిస్తారు కానీ పూజించే పద్ధతులు వేరు వేరు.

నాగ సాధువు కావడానికి అఖారాలో గురువుకు సేవ చేయడం తప్పనిసరి. గురువు యొక్క బోధనలు సరైన మార్గంలో పొందినప్పుడు నాగ సాధువుగా మారే ప్రక్రియ పూర్తవుతుంది. నాగ సాధువులు శిక్షణ పొందిన యోధులనడంలో సందేహం లేదు. అఘోరీలను శివుని ఐదవ ముఖంగా పరిగణిస్తారు. అఘోరీలు స్మశానవాటిక దగ్గర కూర్చుని తపస్సు చేస్తారు. తపస్సు సమయంలో వారు దైవిక శక్తులను పొందుతారు. 

నాగ సాధువులు శాఖాహారులు. కానీ అఘోరీలు శాకాహారంతో పాటూ మాంసాహారం కూడా తింటారు. 

నాగ సాధువులు నగ్నంగా ఉంటారు. అఘోరీ బాబాలు కూడా నగ్నంగానే సాధనలు చేస్తారు. కానీ జనావాసాల్లోకి వచ్చినప్పుడు సాధారణంగా నలుపు రంగు వస్త్రాన్ని ధరిస్తారు.
అఖారా / అఖాడాలు :
సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావి తరాలకు ధర్మాన్ని, శాస్త్రాలను అందించడానికి ఏర్పడిన సంస్థనే అఖరా అని పిలుస్తారు. ఈ అఖారాలను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం 13 అఖారాలకు చెందిన సాధు సన్యాసులు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో సందేహంలేదు. సాధారణ సమయాలలో జనావాసాల్లో కనపడని సాధు సన్యాసులు ఈ కుంభమేళాల్లో మాత్రమే మనకు దర్శనమిస్తారు. వీరిలో కొన్ని వందల సంవత్సరాలు వయస్సు ఉన్న తపస్విలు కూడా ఉంటారు. కుంభమేళాలో స్నానం చేసే మొదటి వ్యక్తులు నాగ సాధువులు.