మంగళవారం, నవంబర్ 17, 2020

నైమిశారణ్యం

నైమిశారణ్యం

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.

మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో అలరారుతున్న ఈ దివ్య ధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సూత, శౌనకాది మహా మహర్షులు నివశించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది.

అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని
తీర్థానాముత్తమం తీర్థం
క్షేత్రాణాం క్షేత్రముత్తమం అని పిలుస్తారు.

సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశంతంగా ఆధ్యాత్మకానుభూతులను ప్రోది చేసే దివ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని స్థానికులు నీమ్ సార్ గా, నీమ్ చార్ వ్యవహరిస్తుంటారు.

స్థల పురాణం :

ఒక సారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలి ప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా వుంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటికుండం  ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. ఈ పవిత్ర తీర్థాన్ని చక్ర తీర్థంగా పిలుచుకుంటున్నాం. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన రోజున సోమవతీ అమావాస్య అని పిలవడం జరుగుతుంది. అలాంటి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు, జపాలు అఖండమైన పుణ్యాన్ని ఆపాదించి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి. నైమిశారణ్యం దివ్యక్షేత్రం. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన అన్ని సంప్రదాయాలతో పాటూ హిందూ ధార్మిక విధానాలూ భక్తులకు అందుబాటులో ఉంటాయి. అనుక్షణం భగవంతుని నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యధామం ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది.

అలాగే దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది. వృత్తాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు దేవతలకు ఓ దివ్యాస్త్రం కావల్సి వచ్చింది. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుని వేడుకోగా దధీచి మహముని ఎముకలు నారాయణ తేజస్సుతో ప్రకాశిస్తాయని, ఆయన వెన్నెముక దివ్యాస్త్రంగా రూపొందుతుందని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారట. దేవతల అభీష్టం తెలుసుకున్న దధీచి మహాముని ప్రాణత్యాగం చేసి పూజ్యనీయుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దధీచి మహర్షి లోకకల్యాణార్థం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దివ్యస్థలం నైమిశారణ్యమేనని పురాణాల ద్వారా తెలుస్తుంది.


ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పారట. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.


దేవాలయాలు :

నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రముతో, త్రిశూల చిహ్నాముతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజుల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని గణేశ్ జీ అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెప్పబడుతున్న ఈ వినాయకుడికి ముందు ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.

సూత, శౌనుకాది మహా మునులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా విరాజిల్లుతున్న నైమిశారణ్య దివ్యక్షేత్రంలో ప్రతీ అడుగు మహిమాన్విత దేవీదేవతల ఆలయాలతో విరాజిల్లుతోంది. భూతేశ్వర్ నాథ్ మందిరానికి సమీపంలో వున్న మందిరాలలో బదరి నారాయణుడి (దేవ రాజన్ ) మందిరం చెప్పుకోదగినది. ఈ భూలోకంలో ఉన్న 108 వైష్ణవక్షేత్రాలలో బదరీనారాయణుడి ధామం కూడా ఒకటిగా ప్రసిద్ధి నొందినది. దీనితో పాటూ రాధాకృష్ణ, గోపాల్ , కాలభైరవుడు మొదలైన మందిరాలు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తాయి.

నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో లలితామాత దర్శనమిస్తుంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది.

అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరించిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి ,సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే ఈ క్షేత్రంలో విజయవాడ వైఖానన సమాజం వారు నిర్మించిన బాలాజీ మందిరం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది.

నైమిశారణ్యం సందర్శనం బహు జన్మల పుణ్యఫలం. హిందువుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి