ఆదివారం, డిసెంబర్ 14, 2014

మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ? ? ? ? ?

మరణం తరువాత ఏమిటి? 

ఇది చాల మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంకా బతికే ఉన్నాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని.. మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని.. ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.

ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోర ఉపనిషత్తు లో తెలుపబడింది. 

నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు. అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది? అప్పుడు యమధర్మరాజు "నచికేతా! ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకో" అని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు. "నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలని ఉంది" అంటాడు. అప్పుడు యమధర్మరాజు, "ఓ నచికేతా! నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను విను" అంటాడు. 

ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం...

యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు. అయితే తను ఏమి సాధించాలి? నేను ఎందుకు పుట్టాను? అని మాత్రం ఆలోచించడు. ఏదో మంచి జీవితం.. మంచి భార్యా.. తరువాత పిల్లలు.. వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడా తెలుసుకునేంత సమయం లేదు. కాని ఏదో ఒక రోజు నువ్వు కాదన్నా.. ఎవరు కాదన్నా.. మరణం మాత్రం నీ వెనకే ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడా మనం గమనించే పరిస్థితిలో ఉండము.

మరణం తరువాత ఏమీ జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని ఉంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో విలీనం అవుతావు. లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి ఉంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి ఉంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు. 

ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే.. కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని ఉంటే.. నీకు మరల మనిషి జన్మ వస్తుంది. అదీ ఒక మంచి యోగుల కుటుంబంలో.. ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అట్లా కాక, సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి.. మనస్సును బుద్దిని అదుపులో ఉంచుకొని.. యోగాన్ని అవలంబించి.. అన్ని కర్మలను తొలగించుకొని.. నువ్వు విముక్తుడవు అయి ఉంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

కానీ మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినవో లేవో.. కావున మనం మన ఈ స్థూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం ఉంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే.. దానికి మనం చేయవలసిన పని.. సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంక ఎటువంటి సందేహాలు ఉండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి? ఇలా ప్రతీ సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు.. మనస్సు అనేదే ఒక భ్రమ అని. అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ పరమాత్మను మన హృదయంలో దర్శించుకోవడమే.

ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికి మరల ఏ ఏ జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేశిస్తాయి. అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం.. అంటే జ్ఞానాన్ని గ్రహించి, అతని తత్వాన్ని అందరికి తెలియపరచి, ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ.. ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.




4 కామెంట్‌లు: